వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో కలిసి గురువారం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకై క యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేవాలయంలో పురావస్తు, పర్యాటక, దేవాదాయ శాఖల అభివృద్ధి నిధులకు ప్రతిపాదనలు పంపిస్తే పార్లమెంటులో ప్రస్తావించి నిధుల సమీకరణకు తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ పేర్కొన్నారు. రామప్ప శిల్పకళ సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, దశరథ్, దేవాదాయ, టూరిజం, పురావస్తు శాఖల సిబ్బంది ఉన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి


