ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలోని గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో ఉప సంచాలకుడి(డీడీ)గా పనిచేస్తున్న దబ్బగట్ల జనార్దన్ బుధవారం బదిలీ అయ్యారు. మంచిర్యాల గిరిజన సంక్షేమ అధికారిగా వెళ్లారు. ఆయన స్థానంలో నాగర్కర్నూలు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఫిరంగికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారం డీడీగా బదిలీ చేశారు. అదే విధంగా ఐటీడీఏ ఇన్చార్జ్ ఏఓగా ఎస్డీసీ విభాగంలో డీటీగా పనిచేస్తున్న అనిల్కు అదనపు బాధ్యతలను అప్పగించారు.
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
ములుగు రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా నోడల్ ఆఫీసర్ అరుణాదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈకో క్లబ్, బండారుపల్లి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో తెలంగాణ కాలు ష్య నియంత్రణ మండలి సహకారంతో ప్రజా పాలన ప్రగతి ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణాదేవి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా యువత కృషిచేయాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ‘పచ్చని భవిష్యత్ కోసం సుస్థిర అభివృద్ధి, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు’ అంశాలపై నిర్వహించారు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు, పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ సరిత, మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ దేవకి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రసన్న కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
అవగాహనతోనే
ప్రమాదాల నివారణ
భూపాలపల్లి అర్బన్: భద్రతపై అవగాహన కలిగిఉన్నప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఏరియాలోని కేటీకే–5వ గనిలో బుధవారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు భద్రతా నిబంధనలు, పనిస్థలాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్మికులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల భద్రత సంస్థకు అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున భద్రత విషయంలో రాజీ పడొద్దన్నారు. సంస్థ నిర్దేశించుకున్న ‘జీరో హార్మ్’ లక్ష్య సాధనకు యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) తప్పనిసరిగా వినియోగించడం, యంత్రాలు, పరికరాలను నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. పనిస్థలంలో అసురక్షిత పరిస్థితులు కనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రమాదాలను గుర్తించి నివారించే సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు.


