– మరిన్ని ఫొటోలు 8లోu
ములుగు: రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్తో కలిసి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజలకు సామాజిక న్యాయంతో పాటు రాష్ట్ర ఆర్థిక పురోగతిని పెంచే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తూ ప్రతీ కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఐక్యతతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలో పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉద్యమకారుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు.
వైద్య రంగంలో ఉత్తమ సేవలు
ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చామని తెలిపారు. రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన ఈ పథకం ద్వారా జిల్లాలో 7,095 మందికి వైద్యం అందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పేదలకు రూ. 29,15కోట్ల లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 2,500 గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 24,038 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. 34 మలేరియా, 10 డెంగీ కేసులను నిర్ధారించి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించినట్లు వివరించారు. అటవీ ప్రాంతాల్లో తక్షణ వైద్య సహాయం అందించుటకు 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 1,965 మంది పేదగిరిజన ప్రజలకు పరీక్షలు నిర్వహించి వైద్యం అందించినట్లు వివరించారు. సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలను అందించినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ప్రజాదర్బార్ తో సమస్యలు పరిష్కారం
రాష్ట్రంలోనే వినూత్నంగా మొట్టమొదటిసారిగా జిల్లాలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీతక్క తెలిపారు. వెంకటాపురం, ములుగు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని మారుమూల 50 గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించి అర్జీదారుల నుంచి 1,421 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. అందులో 321 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
మహిళా సంఘాలకు
రూ.26 కోట్లకు పైగా రుణాలు
రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
మహిళల ఆర్థిక సాధికారతకు రుణాలు
మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ఊతమిచ్చేలా వివిధ పథకాల కింద రూ.28 కోట్లకు పైగా రుణాలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. జిల్లాలోని 210 స్వయం సహాయక సంఘాలకు రూ.20.50 కోట్ల రుణాలను, 59 గ్రామ సంస్థలకు మార్కెటింగ్ కమీషన్ రూ.1.89 కోట్లను, గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధే లక్ష్యంగా మహిళా సభ్యులకు రూ.1.59 కోట్లను అందించినట్లు వెల్లడించారు. అలాగే సీ్త్ర నిధి ద్వారా రూ.2.20 కోట్లను, మెప్మా బ్యాంకేజీ కింద రూ.2.15 కోట్లను లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు వెల్లడించారు.


