● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 4, 6, 8, 10వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామసభలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సభల కార్యక్రమాల ప్రణాళిక, ఏర్పాట్లు, వ్యవసాయం, విపత్తు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ పర్యావరణ వారోత్సవాల నిర్వహణతో పాటు గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజలు మొక్కలు నాటడం, వర్షాభావ పరిస్థితులు వస్తే ఏ విధమైన పంటలు సాగు చేయాలి, సురక్షిత, తాగునీటి సరఫరా, పంటలు మార్పిడి తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జూన్ నెలలో ప్రారంభమయ్యే ప్రత్యే క ఓటరు జాబితా సవరణపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. రైతులు పంటల మార్పిడి పద్ధతులను అనుసరించాలన్నారు. వర్షాకాల సన్నద్ధత, మొక్కల నాటకం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ.ఆనంద్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్, ఎస్పీ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల గ్రామ, వార్డు సభల నిర్వహణకు షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మండలాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఐఓ అప్పలనాయుడు, డీఏఓ సురేశ్కుమార్, డీహెచ్ఓ సంజీవరావు, డీఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


