● ఈనెల 17న కాళేశ్వరంలో
రాతి నిర్మాణాల పనులు ప్రారంభం
● వచ్చే గోదావరి పుష్కరాలకు
ప్రారంభోత్సవాలు
కాళేశ్వరం: కాకతీయులు, చాలుక్యులు 11వ శతాబ్దంలో నిర్మించిన కాళేశ్వరం దేవస్థానం మరో సరికొత్త నిర్మాణాలకు వేదిక కానుంది. 1982కు పూర్వం శిథిలావస్థలో ఉన్న కాళేశ్వరాలయం..దినదినాభివృద్ధి చెందుతుంది. తాజాగా కాళేశ్వరాలయంలో రాతి నిర్మాణాలకు ఏప్రిల్ 20న సీఎం ఎనుముల రేవంత్రెడ్డి రూ.198కోట్ల వ్యయంతో భూమి పూజ చేసిన విషయం విధితమే. ప్రస్తుతం దేవస్థానంలోని నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఈనెల 17న ఉదయం 8 గంటలకు శాస్త్రోక్తంగా విశేష పూజలతో పనులు ప్రారంభిస్తారని ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు స్వయాన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమంలో చెప్పారు. దీంతో కాళేశ్వరం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చి కొంగొత్త రూపు దిద్దుకోనుంది.
రూ.198కోట్లతో ఇలా..
రూ.133.50కోట్లతో ఆలయ కాంప్లెక్స్లోని గర్భాలయం, అర్థమండపం, శిఖరం, నందులు, ధ్వజం, 11 ఉప ఆలయాలు, ప్రాకారం, ఆగ్నేయంలో పాకశాల, నైరుతిలో విజయగణపతి ఆలయం, వాయువ్యంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, నాలుగు రాజగోపురాల నిర్మాణాలు చేస్తారు. ఈఓ కార్యాలయం, దేవస్థానం, దుకాణాల సముదాయం, ఎస్ఎస్ఆర్ కాటేజీ, సింగరేణి గెస్ట్హౌస్లు తొలిగిస్తారని తెలిసింది. రూ. 5కోట్లతో భూసేకరణ కింద సమీపంలోని కొన్ని గృహాలకు సంబంధించి తొలిస్తారని సమాచారం. రూ.35.50కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు, భక్తులు వెయిటింగ్ షెడ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, టిక్కెట్ కౌంటర్ హాల్, కల్చరల్ సెంటర్, బ్యాంకు, ఎస్ఆర్ఆర్ కాటేజీ, ఈఓ కార్యాలయం, ప్రవేశ తోరణం, అభివృద్ధి పనులు చేస్తారు.


