● ఉద్యమంలో కీలకపాత్ర
పోషించిన విద్యార్థులు, యువత
ములుగు: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన పోరాటంలో నాయకులు పోరాటాలకతీతంగా పోరాటం సాగించారు. ములుగు గిరిజన ప్రాంతంలో మొదలైన ఉద్యమం 2009 తర్వాత తీవ్రస్థాయికి చేరుకుంది. ములుగు ఏజెన్సీలోని 8 మండలాల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. పార్టీలకతీతంగా, సంఘాల కతీతంగా నాయకులు కలిసి రోడ్డెక్కారు. మహిళా సంఘాలు సైతం బతుకమ్మ ఆడుతూ, రోడ్లపై వంటావార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణాల్లో చదువుకునే విద్యార్థులంతా గ్రామాలకు చేరుకొని యువతతో కలిసి ఉద్యమం తీవ్రరూపం దాల్చేలా పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం మారుమోగింది. అందరూ ఏకతాటిపైకి వచ్చి అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమ పోరాటాన్ని కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ కోసం రాష్ట్రంలో బలిదానాలు చేసుకుంటుంటే బలిదానాలు వద్దని, పోరాటాల ద్వారానే తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందామంటూ పోరాటం చేశారు. వాహనాలతో ర్యాలీలు, రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు, నిరహారదీక్షలు చేపట్టారు. సకల జనుల సమ్మెలో విద్యార్తులు సైతం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు.


