ఏటూరునాగారం: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటావేసి మిల్లులకు తరలించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రంలోని జీసీసీ, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. 40 రోజులుగా ధాన్యం అమ్ముడుపోక కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న స్థానిక రైతుల ఇబ్బందులను, వారి ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేస్తూ అన్నదాతలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. మంత్రి సీతక్క హామీలు మాటలకే పరిమితం అయ్యాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులకు పైగా ధాన్యం నిల్వలు పేరుకుపోయి అకాల వర్షాలకు తడిసిన వడ్లన్నీ నల్లబడిపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యమంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రదీప్రావు, తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, కిరణ్, రామ్మూర్తి, అశోక్, చిన్ని కృష్ణ, వలిబా బా, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు


