ములుగు రూరల్: టీబీ వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం టీబీ నియంత్రణ సిబ్బంది సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ నియంత్రణ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం టీబీ నిర్ధారణకు రెండు డిజిటల్ ఎక్సరే మిషన్లు అందించిందని తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన 20 గ్రామాలలో 14 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీబీ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు పంపిణీ చేయాలని సూచించారు. టీబీ నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని డీఎంహెచ్ఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీబీ నియంత్రణ కోఆర్డినేటర్ రమేశ్, చంద్రమౌళి, సమ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి గోపాల్రావు


