ఏటూరునాగారం: వార్తలు రాసిన జర్నలిస్టుల ఇళ్లను ముట్టడిస్తామని కొంత మంది మీడియాపై చేస్తున్న బెదిరింపులు మానుకోవాలని పలువురు జర్నలిస్టులు అన్నారు. కాంగ్రెస్ నాయకులు జర్నలిస్టులపై చేసిన వాఖ్యలకు నిరసనగా గురువారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్ వద్ద నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏటూరునాగారంలో జరిగిన మంత్రి సీతక్క ప్రెస్మీట్ను బహిష్కరించారు. అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు సోషల్మీడియాలో ఇళ్లను ముట్టడిస్తామని బెదిరింపులకు పాల్పడడం అప్రజాస్వామికం అన్నారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అఫ్జల్పాషా, అలువాల శ్రీనివాస్, బట్టు గోపి, కుదురు పాక రాజేష్, నూక ప్రభాకర్, వసంత రమేష్, చింతలపల్లి వెంకటేశ్వర్లు, పర్వతాల లాలయ్య, ఎగ్గడి రవి, ఎండి. అక్తర్, శ్రీనివాస్, గంజి రమేష్, గణపనేని చంద్రశేఖర్, రాజేష్, కుదురుపాక ప్రవీణ్, నూతి ప్రణయ్, గౌరిశంకర్ పాల్గొన్నారు.
‘కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’
జర్నలిస్టులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన సందర్భంగా నాగజ్యోతి మాట్లాడారు. మండలం లోని జర్నలిస్టులు ఇళ్లను ముట్టడిస్తామని, వారిపై దాడులు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.


