● యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రవీణ్కుమార్
ములుగు రూరల్: స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర స్కావెంజర్స్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట స్కావెంజర్లతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు, మొక్కల పెంపకం, టాయిలెట్లు శుద్ధి చేసేందుకు స్కావెంజర్లను నియమించారని తెలిపారు. గత విద్యా సంవత్సరంలో మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుందన్నారు. దీంతో పాటు 2025–26 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ నెల వేతనం సైతం పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కావెంజర్లు రమ, ఎలేంద్ర, జమున, రాజేశ్వరి, ఉమరాణి, సమ్మక్క, కవిత తదితరులు పాల్గొన్నారు.


