న్యూస్రీల్
మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజనదర్బార్లో ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు వెల్లువలా వచ్చాయి. ప్రజావాణిలో 113 అర్జీలను బాధితులు అందజేయగా ఐటీడీఏలో 22 వినతులను అందజేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావుతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతీవారం నిర్వహించే ప్రజావాణిలో ముందు వారం వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై రిపోర్టు అందించాలని సూచించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఏపీఓ నాగోరావు వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
చల్వాయి గ్రామంలో గతంలో ఉన్న పూరిగుడిసె కూలిపోవడంతో అద్ధె ఇంట్లో జీవిస్తున్నాము. కుటుంబ పోషణతో పాటు అద్దె చెల్లించడం భారంగా ఉంది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాం. అయినప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. విచారణ జరిపించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
– గద్వాల రమేశ్, చల్వాయి
భూమికి పట్టా ఇప్పించాలి
జాకారం శివారులో తనకు వారసత్వం కింద వచ్చిన భూమి సర్వే నంబర్ 53/30/సిలో 10 గుంటల భూమికి పట్టా ఇప్పించాలి. 40 ఏళ్లుగా కాస్తు కబ్జాలో ఉన్నాను. ఈ భూమిని నా బిడ్డకు పసుపు కుంకుమల కింద ఇచ్చాను . భూమిని వారికి అప్పగించాలి. భూమి పట్టా ఇప్పించి ఆదుకోవాలి.
– కురాకుల లక్ష్మీ, జాకారం
ప్రజావాణిలో వచ్చిన
దరఖాస్తుల వివరాలు
ఇందిరమ్మ ఇళ్లు 25
పింఛన్లు 51
ఇతర సమస్యలు 37
ప్రజావాణిలో 113,
గిరిజన దర్బార్లో 22 అర్జీల రాక
స్వీకరించిన కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఏపీఓ నాగోరావు
వినతులకు సత్వర పరిష్కారం
చూపాలని అధికారులకు ఆదేశాలు


