ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు: రెండో విడతలో ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టీఎస్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు–2025లో భాగంగా శనివారం కలెక్టర్ ములుగు మండల ప్రజాపరిషత్ కార్యాలయం, వెంకటాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతీ కౌంటర్, ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం తనిఖీ చేసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఫామ్ 9 ప్రకారం సిబ్బంది తప్పనిసరిగా బ్యాలెట్ బాక్స్ చెక్ చేసుకోవాలని, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అందించిన సామగ్రిని జాగ్రత్తగా సీల్ చేసి డిపాజిట్ చేయాలన్నారు. సిబ్బందికి సందేహాలు ఉంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏర్పాటు చేశామని, వాటి ద్వారా సందేహాలను నివృత్తి చేసుకొని ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీఎస్
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి


