మేడారంలో పూజలు
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క సారలమ్మను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, ఏటూరునాగారం సర్పంచ్ శ్రీలత కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు వారికి సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని అందించి సన్మానించారు. అనంతరం మేడారం జాతర పనులు విషయాలను జగ్గారావుతో చర్చించారు. కార్యక్రమంలో ప్రదీప్రావు, ప్రవీణ్రావు, పూజారులున్నారు.
ముళ్లకట్ట సర్పంచ్ ఎన్నికలో అక్రమాలు!
ఏటూరునాగారం: ముళ్లకట్ట సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. శనివారం మండలంలోని ముళ్లకట్ట గ్రామ పంచాయతీ, గ్రామంలో ఎన్నికల సమయంలో జరిగిన గొడవపై ఆరా తీశారు. గ్రామంలో తక్కువ ఓటర్లు ఉండగా ఎక్కువ మంది ఓటు వేశారని, కొందరు నాయకులు రిగ్గింగ్ చేశారని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలు, సర్పంచ్ అభ్యర్థి మహేశ్వరి కోరారు. దీనిపై స్పందించి ప్రజలతో సంతకాలు తీసుకుని కమిషన్కు ఈమెయిల్ చేసినట్లు నాగజ్యోతి తెలిపారు. ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ములుగు: జిల్లాలో నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 515 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 433 మంది హాజరైనట్లు జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి వినోద్కుమార్ తెలిపారు. జిల్లాలోని ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 162 మంది విద్యార్థులకు 149 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. ములుగు జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 161 మంది విద్యార్థులకు 129 మంది హాజరుకాగా 32 మంది గైర్హాజరు కాగా, బండారుపల్లిలోని ఆదర్శ పాఠశాలలో 192 మంది విద్యార్థులకు 155 మంది హాజరుకాగా 37 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. జిల్లాలో 515 మంది విద్యార్థుల కోసం మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 433 మంది విద్యార్థులు హాజరు కాగా 82 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
క్రీడలతో ఆరోగ్యం
భూపాలపల్లి అర్బన్: క్రీడలు గెలుపోటములకే కాకుండా ఆరోగ్యం, ఉత్సాహానికి ఉపయోగపడతాయని ఏరియా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు సునీత తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో మహిళలకు వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించారు. సునీత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. క్రీడా పోటీలు కేవలం ఆటలు మాత్రమే కాదని, మనలో ఉన్న సహకారం, క్రమశిక్షణ, ఆరోగ్యం, ఉత్సాహం వంటి విలువలను మరొకసారి మనకు గుర్తు చేస్తాయన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విజేతలే అని గెలుపోటములు సహజమన్నారు. ధైర్యం, కలిసికట్టుగా ముందుకు సాగే తపన అదే నిజమైన విజయమని చెప్పారు. సేవ సభ్యులు సేవాభావం, అంకితభావం సంస్థకు, సమాజానికి అమూల్యమైనవని అన్నారు. క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, ఉత్సాహంగా పాల్గొన్న సేవ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈనెల 23న జరిగే సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో బహుమతులను అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, స్పొర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, సేవా కార్యదర్శి రుబీనా, సభ్యులు పాల్గొన్నారు.
మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 1వ గనిలో కార్మికులపై మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సమ్మయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1వ గనిలో కొంత మంది మైనింగ్ అధికారులు కార్మికులను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు తెలిపారు. ఫిల్లింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికులపై అనవసరమైన ఒత్తిడి, అవమానకరమైన ప్రవర్తన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. నాయకులు రత్నం అవినాష్, దేవరకొండ మధు పాల్గొన్నారు.


