
బోనస్ అందేదెప్పుడో?
● జిల్లా వ్యాప్తంగా 39,412.180 క్వింటాళ్ల సన్నధాన్యం కొనుగోలు
● రావాల్సిన బోనస్ రూ.19.70కోట్లు
ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో సన్నరకం ధాన్యం నాలుగున్నర ఎకరాల్లో సాగు చేశాను. సన్నరకం వరి సాగుకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ కాగా దిగుబడి తక్కువ వచ్చింది. వరిధాన్యం అమ్మి మూడు నెలలు గడిచినప్పటికీ బోనస్ డబ్బులు జమకాలేదు. ఈ ఏడాది వర్షాకాలంలో పంటల సాగుకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలి.
– ఇమ్మడి భిక్షపతి, రైతు, ములుగు
రాష్ట్ర ప్రభుత్వం బోనస్కు బడ్జెట్ కేటాయించలేదు. రైతుల నుంచి సన్నధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఎంఎస్పీ డబ్బుల చెల్లింపులు వెంటనే జరిగాయి. జిల్లాలో సన్నధాన్యం అమ్మకాలు చేపట్టిన రైతుల వివరాలు ఐఎఫ్ఎంఎస్ లాగిన్ నుంచి ప్రభుత్వానికి అందించాం. బడ్జెట్ కేటాయించిన వెంటనే బోనస్ డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతాయి.
– ఫైజల్ హుస్సేన్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్నధాన్యానికి క్వింటాకు బోనస్ రూ.500 ప్రకటించింది. దీంతో యాసంగి సాగులో జిల్లా ఎక్కువ శాతం రైతులు సన్న రకం ధాన్యం సాగు చేశారు. యాసంగి పంట అమ్మకాలు చేపట్టి మూడు నెలలు గడుస్తున్నా సన్న ధాన్యానికి బోనస్ అందకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించగా ప్రభుత్వం మద్దతు ధర రూ.2,320 చెల్లించింది. కానీ బోనస్ డబ్బులు మాత్రం రైతుల ఖాతాలలో జమ కాలేదు.
మూడు నెలలు గడిచినా..
యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ, జీసీసీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో 130 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అధికారులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే చివరి వరకు ధాన్యం కొనుగోళ్లు చేశారు. నెలలు గడుస్తున్నా సన్నధాన్యం పండించిన రైతుల ఖాతాలలో ఇప్పటి వరకు బోనస్ డబ్బులు జమ కాలేదు. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా మొత్తం 81,874.320 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39,412.180 క్వింటాలుగా ఉంది.
6,182 మంది రైతులకు..
రూ.19.70 కోట్లు
జిల్లాలోని 10 మండలాల్లో యాసంగిలో సన్నధాన్యం పండించిన రైతులకు రూ.19.70కోట్లు చెల్లించాల్సి ఉంది. 6,182 మంది రైతులు 39,412.180 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించారు.

బోనస్ అందేదెప్పుడో?

బోనస్ అందేదెప్పుడో?