
వినతులు పరిష్కరించండి..
ములుగు/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై బాధితులు వినతులు విన్నవించి పరిష్కరించాలని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 40 ఫిర్యాదులు రాగా కలెక్టర్ దివాకర స్వీకరించారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 15 వినతులు రాగా పీఓ చిత్రామిశ్రా స్వీకరించారు. మొత్తంగా వచ్చిన 55 వినతులను పరిశీలించిన అధికారులు ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. వాటిని తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.
గిరిజన దర్బార్లో..
వాజేడు మండల పరిధిలోని పెద్దగొల్లగూడెం ప్రాంతానికి చెందిన గిరిజనులు బోరు మంజూరు చేయాలని కోరారు. ములుగు మండలం బంజరుపల్లిలో సమ్మక్క– సారక్క గాల్ఫర్ మిషన్ వెల్ఫేర్ సొసైటీకి ఐటీడీఏ పరిధిలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పారిశుద్ధ్యం, క్లీనింగ్కు కల్ఫార్ మిషన్ ద్వారా సెప్టిక్ ట్యాంకులను క్లీనింగ్ చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. గూడూరు మండలం ఏపూర్ గ్రామానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వాంకుడోతు శరత్కు నేర చరిత్ర ఉందని, అతనిని ఉద్యోగం నుంచి తొలగించాలని విన్నవించారు. జిల్లాలోని పలువురు గిరిజన విద్యార్థులు ఆర్డీ జూనియర్ కళాశాలలో చదువుతున్నామని దానిని తొలగిస్తున్నారని, వేరే కళాశాలలో చేరే ఆర్థిక స్థోమత తమకు లేదని అందుకని కాజేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో సీటు ఇప్పించాలని కోరారు. 2017–2018లో బెస్ట్ అవైలబుల్ స్కీంలో సీట్లు పొందామని, 2023 – 2025 వరకు బిల్లులు రాలేదని ఫీజు చెల్లిస్తేనే పై తరగతులకు పంపిస్తామని అంటున్నారని బాధితులు గోడువెల్లబోసుకున్నారు. రెండు సంవత్సరాల ఫీజును ప్రైవేట్ స్కూళ్లకు చెల్లించా లని పీఓను కోరారు. మండలంలోని బూటారంకు చెందిన గిరిజనుడు జీఎంసీ ములుగులో మెస్ఫీజు చెల్లించాలని కోరారు. ఇలా పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఓకు వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, మేనేజర్ శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, జీసీసీ డీఎం ప్రకాశ్ పాల్గొన్నారు.
ప్రజావాణిలో 40, గిరిజనదర్బార్లో
15 ఫిర్యాదులు
స్వీకరించిన కలెక్టర్ దివాకర,
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
ప్రజావాణి వినతులు ఇలా..
భూ సమస్యలు: 13
గృహ నిర్మాణ శాఖ: 15
పింఛన్లు: 2
ఇతర శాఖలు: 10