
మల్లంపల్లి ఇక జేడీ మల్లంపల్లి
● చిరస్థాయిలో నిలిచిన జేడీ పేరు
● మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపిన మండల సాధనసమితి నాయకులు
ములుగు: ములుగు మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్(జేడీ) పేరు ప్రజల్లో చిరస్థాయిలో నిలిచిపోయింది. ప్రజలు, మండల సాధన సమితి ఆకాంక్షల మేరకు నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా మార్చడానికి రెవెన్యూ ప్రధాన కార్యదర్శి నవీన్మిట్టల్ శనివారం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2019 జూన్ 8న ములుగు జిల్లా తొలి జెడ్పీ చైర్మన్గా ఎన్నికై న జేడీ తన స్వగ్రామం మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వానికి పలుమార్లు విన్నంచారు. పట్టుదలతో కృషి చేయడంతో స్థానికులు ఆయనకు అండగా నిలిచారు. అయితే అనారోగ్యం కారణంగా జేడీ 2023 జూన్ 11న మృతిచెందారు. దీంతో ఆయన పోరాటం వృథా కావ్వొద్దని మల్లంపల్లిని జేడీ మల్లంపల్లిగా ఏర్పాటు చేయాలని ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వారికి మంత్రి ధనసరి సీతక్క అండగా నిలబడడంతో పాటు ప్రభుత్వాన్ని ఒప్పించడంతో ఈ ఏడాది 2024 నవంబర్ 28న మల్లంపల్లి మండలంగా ఏర్పాటు అయ్యింది. విజయోత్సవ సభకు హాజరైన మంత్రి సీతక్కను కలిసిన మండల సాధన సమితి నాయకులు జేడీ మల్లంపల్లి పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా పేరుమార్పిస్తానని సీతక్క హామీ ఇచ్చారు. ఈ మేరకు జేడీ బీఆర్ఎస్ నాయకుడు అయినప్పటికీ తారతమ్య బేధాలు లేకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి జేడీ మల్లంపల్లిగా మార్చడంపై హర్షం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కావడంతో మంత్రి సీతక్కకు నాయకులు, ప్రజలు, మండల సాధన సమితి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.