
ఉద్యమాలతోనే మండలం ఏర్పాటు
ములుగు రూరల్: ప్రజల ఆకాంక్ష మేరకు మండల సాధన సమితి నాయకుల ఉద్యమాలతోనే మల్లంపల్లి మండలం ఏర్పాటు సాధ్యమైందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు మంగళవారం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్ పేరును జోడిస్తూ జేడీ మల్లంపల్లి మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి సీతక్క మండల కేంద్రానికి రాగా మల్లంపల్లి వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు సీతక్క జేడీ మల్లంపల్లి బోర్డును ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడైన జగదీశ్ పేరును మండలానికి నామకరణం చేయడం ఆనందంగా ఉందన్నారు. జగదీశ్ అభిమానులు మంత్రి సీతక్కకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం జగదీశ్ తల్లిదండ్రులను మంత్రి సీతక్క శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్కకు సన్మానం
అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ ప్రభుత్వం మే 30న జీఓ నంబర్ 8ని విడుదల చేయడంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మంత్రి సీతక్కను క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీల యూనియన్ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష నుంచి 2లక్షలు, హెల్పర్లకు రూ.50 వేల నుంచి లక్షకు పెంచుతూ జీఓ విడుదల చేయడం శుభ పరిణామమన్నారు. 2024 జూలై 1వ తేదీ నుంచి రిటైర్మెంట్ అయిన అంగన్వాడీలకు సైతం జీఓను వర్తింపజేయాలని కోరారు. ఈ విషయంపై మంత్రి సీతక్క స్పందించి రిటైర్మెంట్ అయిన 10 వేల మంది అంగన్వాడీలకు బెన్పిట్స్ వర్తింపజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, కోశాధికారి మంగ, రమాకుమారి, జిల్లా నాయకులు సమ్మక్క, సరోజన తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క

ఉద్యమాలతోనే మండలం ఏర్పాటు