
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలు
వెంకటాపురం(కె): రైతులకు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ అన్నారు. మండల పరిధిలోని ఎరువులు, పురుగు మందుల షాపులను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. షాపుల్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పని సరిగా బిల్లులు ఇవ్వాలన్నారు. స్టాక్ బోర్డు షాపుల ముందు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి నవీన్ ఉన్నారు.
వరి విత్తనాల ప్యాకెట్ల పంపిణీ
మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో మంగళవారం పలువురు రైతులకు ఉచిత వరి విత్తనాల ప్యాకెట్లను ఏడీఏ అవినాష్ వర్మ అందజేసి మాట్లాడారు. మండల పరిధిలోని 64గ్రామాల్లో వరంగల్ 962 రకం వరి విత్తనాల 10కేజీల బ్యాగ్ను గ్రామానికి ఇద్దరు రైతుల చొప్పున ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్, ఏఈఓ శ్యామ్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.