
ఇసుక లారీలు.. ట్రాఫిక్ జామ్
మంగపేట: మండలంలోని మంగపేట, మల్లూరు, వాడగూడెం ఇసుక క్వారీలకు వచ్చి పోయే లారీలను ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై నిలిపి వేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ సమస్య నిత్యకృత్యంగా మారింది. తాజాగా శనివారం మల్లూరు వద్ద ప్రధాన రోడ్డుపై, కోడలు చెరువు వద్ద ఇసుక లారీలు నిలిపి ఉంచడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో దాదాపుగా గంటన్నర వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో రోడ్డుపై వచ్చిపోయే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు
చేయని నిర్వాహకులు
ఆయా ఇసుక క్వారీలలో లోడింగ్ కోసం వచ్చే లారీలను నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు అనువైన స్థలాలను కేటాయించకపోవడంతో లారీలను రోడ్డుపై నిలపకతప్పడం లేదని లారీల డ్రైవర్లు వాపోతున్నారు. అయినప్పటికీ నిర్వాహకులు మాత్రం గోదావరిలోని క్వారీలలోకి ఇసుక లోడింగ్కు వెళ్లే ముందు పార్కింగ్, సీరియల్, లోడింగ్ చార్జీల పేరుతో అక్రమంగా ఒక్కో లారీకి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదేమని అడిగితే తమపై జులుం చేస్తుండడంతో తప్పని సరి పరిస్థితిలో అదనంగా డబ్బులు చెల్లిస్తున్నట్లు లారీల ఓనర్లు, డ్రైవర్లు వాపోతున్నారు.
నెలరోజులుగా..
నిత్యం రేయింభవళ్లు రోడ్డుపై వచ్చిపోయే వందలాది ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు ఇతర ప్రైవేటు వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్డుపై ఇసుక లారీలను అడ్డదిడ్డంగా నిలిపి వేస్తుండడంతో నెలరోజులుగా ట్రాఫిక్ సమస్య నిత్యం తలెత్తుతోంది. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండటంతో ప్రజలు, ప్రయాణికుల నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీ, ఆర్ఆండ్బీ అధికారులు వెంటనే స్పందించి లారీలను రోడ్డుపై నిలుపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా రు. లేని పక్షంలో స్థానిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మండల ప్రజలు, వాహనదారులు హెచ్చరిస్తున్నారు.
మల్లూరు ప్రధాన రోడ్డుపై నిలిచిన ఇసుక లారీలు
ప్రతిరోజూ వాహనదారులకు తప్పని తిప్పలు
పట్టించుకోని అధికారులు

ఇసుక లారీలు.. ట్రాఫిక్ జామ్