
‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలి
ములుగు: ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమై కలెక్టరేట్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ దివాకరకు అందించారు. అనంతరం నిర్వహించిన సభలో విమలక్క మాట్లాడుతూ బీజాపూర్, నారాయణపూర్, కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఐ మావోయిస్టు నాయకులు నంబాల కేశవరావుతో పాటు మరో 26 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ యుగేంధర్, రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెల్తూరి సదానందం, ఉపాధ్యక్షుడు మోకాళ్ల సమ్మన్న, ఏఐ ఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్, అరుణోదయ ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
● అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క