
కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి
● ఇన్చార్జ్ ఓఎస్డీ, డీఎస్పీ రవీందర్
ములుగు: ప్రజలు కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, బలవన్మరణాలకు పాల్పడవద్దని జిల్లా ఇన్చార్జ్ ఓఎస్డీ, డీఎస్పీ నలువాల రవీందర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం తన కార్యాలయంలో ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ పరికిపండ్ల అశోక్ సమక్షంలో ఆత్మహత్యలపై రూపొందించిన కరపత్రాన్ని డీఎస్పీ ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఇరవై ఏళ్లుగా ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తుందన్నారు. ఇప్పటి వరకు 28 మంది జీవితాలను కాపాడడం అభినందనీయమన్నారు. ఇటీవల పోలీస్ శాఖలో ఎక్కువగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటుండడం బాధాకరం అన్నారు. త్వరలో డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో ఆత్మహత్యల నివారణ సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు రవీందర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, చిందం మొగిలి, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నం మోహన్కుమార్, ఆరోగ్యమిత్ర ప్రతినిధులు సహజ, శుభ, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.