
ఆర్వైవీఎస్ సర్టిఫికెట్ల సంయుక్త పరిశీలన
గోవిందరావుపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకానికి మండల వ్యాప్తంగా 2188 దరఖాస్తులు వచ్చాయి. రాజీవ్ యువవికాసం పథకం కోసం ధరఖాస్తులు చేసుకున్న వారి సర్టిఫికెట్లను సోమవారం ఎంపీడీఓ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్ స్వామి, బీసీ కార్పొరేషన్ ఈడీ రవీందర్ రెడ్డి లు సంయుక్త పరిశీలన (జాయింట్ స్క్రీనింగ్) నిర్వహించారు. మండలంలో రెండు బ్యాంకులు ఎస్ బీఐ గోవిందరావుపేట శాఖ, టీజీబీ పస్రా శాఖ ఖా తాదారులు మొత్తం 2188 దరఖాస్తులు చేసుకోగా సోమవారం ఎస్బీఐ శాఖ కింద వచ్చిన 1101 మంది దరఖాస్తులదారులకి సంయుక్త పరిశీలన చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కింద వచ్చిన మరో 1087 మంది దరఖాస్తులను మంగళవారం పరిశీలించనున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సృజన్ కుమార్, ఎంపీఓ మమత, సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్, పంచాచతీ కార్యదర్శులు డేగల శంకర్, అశోక్, చుంచు భారతి పాల్గొన్నారు.