
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
చిట్యాల: కొనుగోలు కేంద్రాల్లో మ్యాచర్ వచ్చిన వరి ధాన్యాన్ని సెంటర్ ఇన్చార్జ్లు త్వరితగతిన మిల్లులకు తరలించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.వీరునాయక్ కోరారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సెంటర్ సిబ్బందికి సూచనలు చేశారు. రైతులు వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని కోరారు. అనంతరం మండలకేంద్రంలోని రైతువేదికలో జరిగిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవాబుపేట గ్రామానికి చెందిన పున్నం అశోక్కు సంబంధించిన వరి విత్తనోత్పత్తి పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, ఏఓ శ్రీనివాస్రెడ్డి, ఎఈఓ సన్నీ, రైతులు పాల్గొన్నారు.
ఫార్మర్ ఐడీ తీసుకోవాలి
టేకుమట్ల: రైతులందరూ ఫార్మర్ ఐడీ తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయాధికారి కల్యాణి ఆధ్వర్యంలో రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి ఆధార్ కార్డు వలే రైతులందరికీ ఫార్మర్ ఐడీ తీసుకోవాలని అన్నారు. ఫార్మర్ ఐడీలో రైతుల వ్యవసాయ భూములు వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారని అన్నారు. రైతులందరూ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రాహుల్, భరత్, అరుణ్, యోగిత పాల్గొన్నారు.