
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● మంత్రి ధనసరి సీతక్క
ములుగు: వైకల్యమనేది కేవలం శరీరానికి మాత్రమేనని మనసుకు కాదని, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల శాఖల మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ అధికారిణి శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల పరిధిలోని బళ్ల సంజయ్, నాగయ్య, కృష్ణ, కందికట్ల సాంబయ్య (నలుగురికి)లకు రూ.2లక్షల విలువైన బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లను కల్పించామన్నారు. ఉద్యోగాలు, ఉపాధికి ఏ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించిందన్నారు. కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంలో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ శాలినీ మిశ్రా మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో ఈ ఉపకరణాలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తదితరులున్నారు.
చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలి
విద్యార్థులు విద్యతో పాటు సంస్కారం నేర్చుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఇంటర్మీడియట్, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. పదో తరగతిలో ఎనిమిదో స్థానంలో నిలవడం సంతోషయమే అయినప్పటికీ రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ విద్యార్థులు ముందస్తు ప్రణాళికతో చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, గ్రంథాలయ చైర్మన్ రవి చందర్, ఆర్డీఓ వెంకటేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, డీడీ పోచం, ఎస్ఓ రాజు కుమార్ అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గోన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఎదురౌవుతున్న సమస్యలు తెలుసుకోవడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ (ఏటూరునాగారం) పీఓ చిత్రమిశ్రా అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఇప్పటివరకు ఐటీడీఏ పరిధిలోని ఆరు జిల్లాలలో చేపట్టిన పనుల వివరాలను సేకరించి నివేదిక రూపంలో అందించాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఈఈ వీరభద్రం, డీడీ పోచం, అధికారులు పాల్గొన్నారు.