
కృషితో ఫలితం
శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
విద్యార్ధులను అభినందిస్తున్న మంత్రి సీతక్క పక్కన కలెక్టర్ దివాకర
ములుగు: మనం చేసే కృషితోనే ఏదైనా సాధించవచ్చు అనేది జిల్లా విద్యార్థులు నిరూపించారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రం స్థాయిలో జిల్లా 13వ స్థానంలో నిలవగా ఈ సారి 8వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా 9మండలాల్లో 3,134 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,060 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 97.64గా ఉత్తీర్ణత శాతం నమోదయింది.
సెప్టెంబర్ నుంచి ప్రత్యేక ప్రణాళిక
మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర చొరవతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణ చేపట్టారు. రోజువారీగా లీజర్ క్లాసుల్లో సబ్జెక్టుల వారీగా రివిజన్ తీసుకొని విద్యార్థుల ప్రతిభను గుర్తించారు. పాఠశాల వారీగా విద్యార్థులను ఏ, బీ, సీ కేటగిరీలుగా గుర్తించారు. సీ కేటగిరిలో 200మంది విద్యార్థులు ఉన్నట్లుగా గమనించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. మొదట వీరికి బిట్స్, చిన్న చిన్న ప్రశ్నలు వంటి వాటిపై పరీక్ష నిర్వహించి వారిలో ఉన్న చురుకుదనాన్ని గమనించారు. దీంతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, తహసీల్దార్ ఎంఈఓలు నిత్యం పర్యవేక్షణ చేస్తూ వచ్చారు. విద్యార్థుల మనోగతాన్ని తీసుకొని వారి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ చూపారు.
సైన్స్, గణితంలో ఫెయిల్
సి కేటగిరిలోని 200 మందిని గుర్తించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 40 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా వారిలో కొంతమేర ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు మరింతగా ప్రోత్సహించారు. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా 74మంది ఫెయిలయ్యారు. ఇందులో ఎక్కువ శాతం సైన్స్లో 39 మంది, గణితంలో 30 మంది, తెలుగులో 10 మంది, సాంఘిక శాస్త్రంలో ఇద్దరు, ఇంగ్లిషులో ఒకరు ఫెయిలయ్యారు. ముఖ్యంగా గణితం సబ్జెక్టు పరీక్ష పేపర్ తప్పుగా వచ్చిందని విద్యార్థులు ఉపాధ్యాయులకు చెబుతున్నారు. ఫెయిల్ అయిన వారిని పాఠశాలకు రప్పించుకొని సప్లమెంటరీ పరీక్షల ద్వారా మరింత ఉత్తమ ఫలితాలు రాబట్టేలా విద్యాశాఖ తరఫున కసరత్తు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో 8వ స్థానంలో
నిలవడం సంతోషకరం
రాష్ట్ర స్థాయిలో జిల్లా గతేడాది 95.65శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. ఈసారి 97.64శాతంతో 8వ స్థానంలో నిలవడం సంతోషకరం. ఫెయిల్ అయిన విద్యార్థులను ప్రోత్సహించి సప్లమెంటరీలో పాస్ అయ్యేలా ప్రణాళిక రూపొందించాం. ఈ విషయాన్ని ఎంఈఓలు, హెచ్ఎంలకు ఉపాధ్యాయులకు తెలియజేస్తాం.
– పాణిని, డీఈఓ
న్యూస్రీల్
గతేడాది కంటే ‘పది’లో మెరుగైన ఫలితాలు
రాష్ట్రంలో జిల్లాకు 8వ స్థానం
అత్యధికంగా సైన్స్లో 39, గణితంలో 30మంది విద్యార్థులు ఫెయిల్

కృషితో ఫలితం

కృషితో ఫలితం