ములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించడం హర్షణీయమని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యానియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ అన్నారు. ఈ మేరకు గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సీతక్కను శాలువాలతో సన్మానించి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించడం ఐసీడీఎస్ చరిత్రలో మొదటి సారి అని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలని, మినీ అంగన్వాడీ టీచర్లకు పెంచిన వేతనాలు చెల్లించాలన్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సునీత, మంగ, శశికళ, రాజేందర్, సమ్మక్క, పద్మారాణి, భాగ్యలక్ష్మి, సరిత, రుక్మిణి, జమున, తదితరులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాల ఫలాలు అందరికీ అందాలి
భూపాలపల్లి అర్బన్: కార్మిక చట్టాల ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే మేడే లక్ష్యం నెరవేరినట్లని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్, కాకతీయ హమాలీ యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మేడే ఉత్సవాల్లో జడ్జి పాల్గొని మాట్లాడారు. కార్మికుల ఆరోగ్యం, భద్రత పెన్షన్ చాలా ముఖ్యమైనవన్నారు. ఈ ఫలాలు అందరికీ అందాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు, న్యాయవాదులు ప్రియాంక, కార్మిక సంఘాల నాయకులు సాయిలు, రమేష్, మహేందర్, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధాన అర్చకుడి ఉద్యోగ విరమణ
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ ఽబుధవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన దేవస్థానంలో పలు హోదాల్లో అర్చక వృత్తిలో కొనసాగారు. గురువారం ఉద్యోగ విరమణ పొందిన దంపతులను ఈఓ శనిగెల మహేష్, అర్చక బృందం,సిబ్బంది, పలువురు నాయకులు సన్మానించారు.
సద్వినియోగం చేసుకోవాలి
మొగుళ్లపల్లి: వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు అన్నారు. మండలంలోని వేములపల్లి గ్రామంలో గురువారం కబడ్డీ కోచింగ్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని క్రీడలలో మెళకువలు నేర్చుకోవాలని కోరారు. ఈ శిక్షణ శిబిరాలు జూన్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోచ్ మహేశ్, కేల్ ఇండియా కోచ్ శ్రీనివాస్, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్
పలిమెల: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు గురువారం ముగిశాయి. క్రీడల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, మహారాష్ట్ర గచ్చిరోలి క్రీడాకారులతో పాటు, ములుగు, భూపాలపల్లి జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్ జట్టు మొదటి విజేతగా నిలిచింది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా.. భూపాలపల్లి జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా గుమ్మలకొండ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.