
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
● వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
ములుగు: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్తో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా తరఫున కలెక్టర్ టీఎస్.దివాకర, అదనపు కలెక్టర్ సంపత్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. తాలు, తరుగు పేరుతో ఎలాంటి కోతలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పరిధిలో అత్యధికంగా రైస్ మిల్లులు మిల్లింగ్ చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీసీఓ సర్దార్సింగ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.