ములుగు: జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల్లో బాండ్ మొక్కజొన్న పేరుతో జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఆయా కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు నేరుగా నష్టపోయిన రైతుల ఖాతాల్లో పరిహారాన్ని జమ చేయాలని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి ధనసరి సీతక్క ఆదేశాలు, కలెక్టర్ సూచనల మేరకు మంగళవారం ఆయా కంపెనీల ప్రతినిధులు, అర్గనైజర్లు, రైతు ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొదండ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ ఆయా మండలాల్లో పర్యటించి బాండ్ మొక్కజొన్న ఆకులు, కంకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ నెల 12, 13 తేదీలలో సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను అందించారని తెలిపారు. దీంతో పాటు డాట్ సెంటర్ శాస్త్రవేత్త దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కజొన్న దిగుబడి తగ్గింపుపై పూర్తిస్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారని వివరించారు. మూడు మండలాల్లో 959మంది రైతులు 20,168 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టపోయినట్లు నివేదిక అందించారని తెలిపారు. అనంతరం ఆర్డీఓ వెంకటేశ్ ఆధ్వర్యంలో సీడ్ కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించి నష్టపరిహారంపై చెల్లింపుల విషయంలో వారు సానుకూలంగా స్పందించారని వివరించారు. కానీ ఆర్గనైజర్లు రైతులకు అనధికారికంగా అధిక వడ్డీలకు అప్పులిచ్చిన విషయంలో మని లెండింగ్ యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాధించినట్లు తెలిపారు. అలాగే రైతుల ఆరోగ్య విషయంలో డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో కమిటీ వేసి బాండ్ మొక్కజొన్న పంట వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ మొక్కజొన్న విత్తన పంట వైఫల్యంపై కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని, ఏజెన్సీలో అధిక వడ్డీ రుణాల దోపిడీని నిరోధించాలని కమిషన్ సభ్యులను కోరగా వారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం గిరిజన రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వివరించారు. బాండ్ మొక్కజొన్న విషయంలో జరిగిన విత్తన వైఫల్యంపై తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కొదండ రెడ్డితో పాటు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సభ్యులు రాములు నాయక్, మామ్రెడ్డి, గంగాధర్, నర్సింహారెడ్డి, వెంకన్న యాదవ్లు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న బాధిత రైతు కుటుంబాల సభ్యులు కలెక్టరేట్కు భారీగా తరలివచ్చారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు సమీక్ష జరుగుతున్నంత సేపు చెట్ల కింద సేద తీరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, కమిషన్ అడ్వైజర్లు నర్సింహారెడ్డి, రామాంజనేయులు, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ సుచరిత, ఆర్డీఓ వెంకటేశ్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యవసాయ రైతుసంక్షేమ
కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
ఖాతాల్లో పరిహారం జమచేయాలి