వాజేడు: ప్రజల రక్షణ, భద్రత కోసం జిల్లా పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. మండల పరిధిలోని కోయవీరాపురం గ్రామాన్ని శనివారం ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్లతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ గ్రామస్తులతో మాట్లాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దని, వారు చేసే సంఘ విద్రోహ చర్యల్లో పాలుపంచుకోవద్దన్నారు. వారికి సహకరిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు, మావోయిస్టులు వస్తే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని, చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని వివరించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెస్సేజ్, వాట్సాప్ కాల్స్కు స్పందించి మోసపోవద్దని సూచించారు. బైక్ నడిపే సమయంలో హెల్మెట్, కారు నడిపితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రహదారిని ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి నిర్మించాలని కోరారు. తమ గ్రామంలో సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల అభ్యర్థనకు స్పందించిన ఎస్పీ శబరీశ్.. కోయవీరాపురం గ్రామానికి కొత్తగా రహదారి వచ్చేలా చర్యలను తీసుకుంటామని, సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వాజేడు, వెంకటాపురం(కె) ఎస్సైలు రాజ్ కుమార్, తిరుపతిరావు, సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు.
మావోయిస్టు కదలికలపై దృష్టి సారించాలి
వెంకటాపురం(కె): జిల్లాలో మావోయిస్టు కదలికలపై అనునిత్యం దృష్టి సారించాలని, గ్రామాల్లో వారి రాకపోకలపై కన్నేసి ఉంచాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రక్షణ కోసం స్టేషన్ నలుమూలల ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ గార్డులను తనికీ చేశారు. గార్డ్లో ఉన్న సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, తమ సిబ్బంది గ్రామాలను సందర్శించినపుడు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మావో యిస్టు కదలికలపై దృష్టిసారించాలని, వారు అమాయక ఆదివాసీ ప్రజలను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో కేసులలో అరెస్టు అయిన మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతిపరులను నిత్యం పర్యవేక్షిస్తుండాలని అదేశించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించాలని అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుక క్వారీల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సైలు కొప్పుల తిరుపతిరావు, స్వామి ఉన్నారు.
ఎస్పీ శబరీశ్
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. వాజేడు పోలీసులు కొంగాల గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. వాజేడు వైద్యాధికారి మధుకర్, ఏటూరునాగారం తేజా హాస్పిటల్ వైద్యుడు రవితేజ గ్రామంలోని రోగులను పరీక్షించి మందులను ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్యం ముఖ్య మన్నారు. అవి రెండు అందుబాటులో ఉంటే ప్రజలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తారన్నారు. మెడికల్ క్యాంపు అనంతరం ఎస్పీ శబరీశ్ దగ్గరకు వచ్చిన కొంగాల పాఠశాల ఉపాధ్యాయుడు కొంత మంది పిల్లలు ఎంత చెప్పినా బడికి రావడం లేదని ఆవేదనతో ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పిల్లలు, వారి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరించారు. ఆయన వెంట ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, వెంకటాపురం(కె) సీఐ కుమార్, ఎస్సైలు కృష్ణ ప్రసాద్, రాజ్ కుమార్, తిరుపతి రావు ఉన్నారు.
ప్రజల రక్షణ కోసం సిద్ధంగా ఉంటాం