ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పెడితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పెడితే చర్యలు

Mar 21 2025 1:16 AM | Updated on Mar 21 2025 1:15 AM

ములుగు: అక్రమ బెట్టింగ్‌ యాప్‌లలో బెట్టింగ్‌ పెట్టినా.. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్పీ డాక్టర్‌ శబరీశ్‌ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. యువత, విద్యార్థులు గేమింగ్‌లకు పాల్పడి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు కోల్పోయి అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. సోషల్‌ మీడియా వీటిని ప్రోత్సహించడం వల్ల యువత ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమ్‌ల కట్టడికి జిల్లా పోలీసు శాఖ తరఫున ఆధునిక సాంకేతికను వినియోగించి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని వివరించారు. సోషల్‌మీడియా వేదికగా ఎవరైనా అక్రమ బెట్టింగ్‌ యాప్‌లపై ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని సూచించారు. ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే 100కి డయల్‌ చేసి సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

రేంజ్‌ అధికారిపై

ఇంటెలిజెన్స్‌ ఆరా?

ఏటూరునాగారం: తునికాకు బోనస్‌ కూలీల డబ్బులను కాజేసిన అటవీశాఖ రేంజ్‌ అధికారిపై ఇంటెలిజెన్స్‌ పోలీసులు కూపీ లాగుతున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై అధికారులు స్పందించి చర్యలను ముమ్మరం చేశారు. ఎవరెవరి బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు వేసి మళ్లీ డ్రా చేయించారని విచారణను చేపట్టినట్లు తెలుస్తోంది. 2023లో జరిగిన అవినీతి అక్రమాల్లో ఎవరు ఎంత డబ్బు కాజేశారని, ఆ బ్యాంకు ఖాతాలు, కూలీల పేర్ల డేటాను సేకరిస్తున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారులు సైతం సదరు రేంజ్‌ అధికారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ములుగు మత్స్యకారులకు శిక్షణ ప్రారంభం

కూసుమంచి: ములుగు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్‌ తెగల మత్స్యకారుల(రెండో బ్యాచ్‌)కు మూడు రోజుల పాటు ఇచ్చే శిక్షణ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరులో శ్రీ పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేపల పెంపకంలో పద్ధతులు, పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ అవగాహన కల్పించారు. అనంతరం వారిని ఫిషరీస్‌ కేంద్రాలకు తీసుకెళ్లి వివిధ రకాల చేపలు, రొయ్యల పెంపకం, వ్యాధుల నివారణ, దాణా తయారీ విధానాన్ని వివరించారు.

ఇంటింటికీ తలంబ్రాలు

ఏటూరునాగారం: ఆర్టీసీ వరంగల్‌ –2డిపో లాజిస్టిక్‌ ద్వారా భక్తుల ఇంటింటికీ భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుకింగ్‌ చేసుకొనే అవకాశం కల్పించినట్లు వరంగల్‌ 2 డిపో మేనేజర్‌ వి.జోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తలంబ్రాల కోసం ఏటూరునాగారం బస్టాండ్‌ కంట్రోలర్‌ చల్లా శ్రీనివాసు సెల్‌ నంబర్‌ 9441991706లో సంప్రదించి బుక్‌ చెసుకొని రశీదు తీసుకోవాలని సూచించారు. సీతారాముల కల్యాణం అనంతరం ఇంటి వద్దకు కార్గో ఏజెంట్‌ ద్వారా తలంబ్రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఉత్తమ ఎస్సైగా తాజుద్దీన్‌

ఏటూరునాగారం: ఉత్తమ పోలీస్‌గా ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు తాజుద్దీన్‌కు రివార్డును ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులు, నేరాలను చాకచక్యంగా పరిష్కరించిన పోలీసులను గుర్తించి నగదు బహుమతి రివార్డులు అందజేయనున్నట్లు వివరించారు. ఉత్తమ పోలీస్‌గా అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఎస్సై సేవలను కొనియాడారు. అనంతరం సీఐ శ్రీనివాస్‌ ఎస్సైకి అభినందనలు తెలిపారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పెడితే  చర్యలు
1
1/1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పెడితే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement