ములుగు: ప్రజలు క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గోపాల్రావు అన్నారు. కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశానుసారం, టీబీ అలర్ట్ ఇండియా, సాహితీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ములుగులోని రాయల్ ప్లాజా యందు జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు హాజరై మాట్లాడారు. జిల్లాలో క్షయవ్యాధిని గుర్తించి చికిత్సతో అంతం చేయాలన్నారు.అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులకు మొదట క్షయ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నిర్ధారణ, చికిత్సపై అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే టీబీపై ప్రజలు చైతన్యవంతులుగా మారి తెమడ పరీక్షలకు వస్తారని తెలిపారు. దీంతో వ్యాధి నిర్మూలనకు చికిత్స సులువు అవుతుందని వెల్లడించారు. జిల్లాకు పోర్టబుల్ క్షయవ్యాధి నిర్ధారణ పరికరాన్ని త్వరగా అందించాలని జిల్లా టీబీ నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పవన్ కుమార్, రణధీర్, శ్రీకాంత్, ప్రియాంక, శ్రవణ్, అనిల్, దుర్గారావు, టీబీ అలర్ట్ ఇండియా జిల్లా కో ఆర్డీనేటర్ రాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ గోపాల్ రావు