● పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రంజాన్ వేడుకల్లో భాగంగా బుధవారం లాలాగార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లిం మతపెద్దలు, కలెక్టర్ దివాకర, ఎస్పీ డాక్టర్ శబరీశ్తో కలిసి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందని, నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటించడం చెప్పుకోదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఆర్డీఓ వెంకటేశ్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, డీపీఆర్ఓ రఫీక్, డీపీఓ దేవరాజ్, ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇసుక సొసైటీలకు
డీఎల్ఎస్సీ నిర్వహించాలి
ఏటూరునాగారం: జిల్లాలో సర్వే పూర్తి చేసుకొని ఉన్న ఇసుక సొసైటీలకు డిస్ట్రిక్ లెవల్ సెలక్షన్ కమిటీ (డీఎల్ఎస్సీ)లను వెంటనే నియమించి సొసైటీలకు అనుమతులు ఇవ్వాలని ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ ఇసుక సొసైటీల ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని వైజంక్షన్ నుంచి ఐటీడీఏ వరకు ఇసుక సొసైటీల సభ్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇసుక సొసైటీల కన్వీనర్ ఈసం రాజు మాట్లాడుతూ గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఇసుక సొసైటీల ద్వారా సాగుతున్న ఇసుక లావాదేవిలకు బిల్లులు చెల్లించకపోతే నిరసన చేస్తామన్నారు. ఇసుక సొసైటీలకు జరుగుతున్న అన్యాయాలపై కలెక్టర్, ఎస్పీ దృష్టి పెట్టాలన్నారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన గిరిజన సొసైటీల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ