ఏటూరునాగారం: అవినీతి పేరు చెబితే అటవీశాఖలో పనిచేసే ఓ రేంజ్ అధికారి పేరు టక్కున చెబుతారు. 2023లో జరిగిన తునికాకు బోనస్ కూలీల డబ్బుల పంపిణీలో చోటుచేసుకున్న అవకతవకల్లో ఆయన కీలక పాత్ర పోషించి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏటూరునాగారం రేంజ్ అటవీశాఖలో పనిచేసే పలువురి సిబ్బంది పేర్లపై 2023 ఆగస్టులో తునికాకు బోనస్ కూలీల డబ్బులను వారి వ్యక్తిగత ఖాతాల్లో వేయించాడు. అనంతరం వారితో తప్పుజారి మీ ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయని.. వాటిని మళ్లీ ఆఫీస్కు కట్టాలని చెప్పి వారి నుంచి రూ.2.50లక్షల నగదు తీసుకున్నాడు. ఈ మోసం గురించి తెలియని సిబ్బంది నిజమే అనుకుని ఆ అధికారికి తిరిగి డబ్బులు ఇచ్చేశారు.
మరి కొంతమంది పరిస్థితి ఇలా..
అటవీశాఖలో పనిచేసే ఓ కంప్యూటర్ ఆపరేటర్ కుటుంబ సభ్యులతో పాటు ఇద్దరు ఏఎన్ఎంల ఖాతాల్లో ఒక్కో లక్ష రూపాయలను జమ చేయించాడు. అలాగే మరో వ్యక్తి ఖాతాలో రూ.70వేలు, రామన్నగూడెంకు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో రూ.2లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా రూ.28లక్షల వరకు పేదల తునికాకు బోనస్ డబ్బులు కాజేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై జిల్లా అటవీశాఖ అధికారులు సైతం మిన్నకుండిపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ అటవీశాఖ రేంజ్ అధికారి అవినీతి అక్రమాలు శాఖలోని ఉన్నతాధికారులకు తెలియడం లేదా.. తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారా అనేది ప్రశ్నగా మారింది. ఇదేకాకుండా స్థానిక పోలీస్స్టేషన్లో ఏడుగురిపై కేసు నమోదైన విషయం విధితమే. కానీ అసలు సృష్టికర్తపై ఎందుకు చర్యలు ఎందుకు చేపట్టడం లేదనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అమాయకులైన సిబ్బందిపై పెట్టిన కేసులను పోలీసులు వెంటనే ఎత్తివేయాలని నేడు(గురువారం) మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కూలీల డబ్బులను కాజేసిన
ఓ అటవీశాఖ రేంజ్ అధికారి
సిబ్బందితో పాటు పలువురి ఖాతాల్లో వేయించి కాజేసిన వైనం
రూ.28లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు
తునికాకు బోనస్లో చేతివాటం