ఏటూరునాగారం: ఎయిడ్స్ వ్యాధిపై యువత తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంతో మెదగాలని ఐసీడీఎస్ సీడీపీఓ ప్రేమలత సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో నెహ్రూ యువకేంద్ర వరంగల్ సౌజన్యంతో కస్తూరిబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని ఏటూరునాగారం డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో యువతకు లైంగిక వ్యాధులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక సమాజంలో యువత చెడుకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవాలన్నారు. ప్రేమ, వ్యామోహం మాటున యువత చెడు దారిలో పయనించకూడదన్నారు. జీవితంలో స్థిరపడిన తర్వాతనే వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో మాత్రమే ఆనందంగా జీవించాలని కోరారు. లేకుంటే అపరిచితులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎయిడ్స్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నెహ్రు యువ కేంద్ర వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం యువత పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, రిసోర్స్ పర్సన్ జ్యోతి, అధ్యాపకులు వెంకటయ్య, స్పోర్ట్స్ఆఫీసర్ శ్యామలత తదితరులు పాల్గొన్నారు.
సీడీపీఓ ప్రేమలత