మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం భక్తజనంతో శనివారం కిటకిటలాడింది. వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంతో పాటు చింతామణి జలపాతం, వనదేవత(దైత అమ్మవారి) ప్రాంతంలో భక్తజన సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బస్సులు తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్శర్మ, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర రామానుజదాస్ స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు.
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి