ములుగు: ప్రజలు వేసవిలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాయలంలోని సమావేశ మందిరంలో శనివారం మాతాశిశు సంరక్షణ సిబ్బంది, ఆర్బీఎస్కే ప్రోగ్రాం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తగిన రక్షణ చర్యలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలు, స్కూల్ పిల్లలకు వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, ఆరోగ్య కార్యకర్త, అశ కార్యకర్తలు సమన్వయంతో గర్భిణులు, బాలింతలకు నిరంతరం పరీక్షలు నిర్వహించాలన్నారు. రక్తహీనత, పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. సాధారణ, సీజేరియన్ కాన్పులతో జరిగే పరిణామాలను వివరించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకే కాన్పులకు వచ్చేలా గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి విపిన్ కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, పవన్ కుమార్, రణధీర్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ నరహరి, కమ్యూనిటీ హెల్త్ అధికారి పూర్ణసంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ గోపాల్రావు