ఏటూరునాగారం: ప్రజాపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలు ఇవ్వలేక సీఎం రేవంత్రెడ్డి చేతులు ఎత్తేశాడన్నారు. స్థానిక మంత్రి సీతక్క కొండాయి బ్రిడ్జిని కట్టించలేకపోతున్నారని తెలిపారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను కమీషన్లుగా పంచుకోవడం సరికాదన్నారు. గ్రామ సభలు నిర్వహించి పనులను గుర్తించి నాణ్యత పనులు చేపట్టాలన్నారు. అలాగే మంగపేట మండల పరిధిలోని బిల్ట్ కర్మాగారం తెరిపించే విషయంలో మంత్రి సీతక్క, సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేతనాలు అందజేసి వారి కష్టాల్లో పాలుపంచుకున్నామన్నారు. కార్మికులు వ్యవసాయ కూలీలుగా మారారని, చాలా మంది మనోవేదనతో మృత్యువాత పడ్డారని వివరించారు. బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపిస్తే వారికి రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే కోల్డ్స్టోరేజీలు నిర్మించాలని కోరారు. గోదావరి కరకట్ట నిర్మాణంలో మంత్రి సీతక్క ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు. అంతేకాకుండా ప్రమాదకరంగా ఉన్న ఇసుక క్వారీలను మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద్నాయక్, సునీల్కుమార్, రఘు, నర్సింహులు, సమ్మ య్య, మల్లారెడ్డి, నర్సయ్య, రాజు, ఖాజాపాషా, కృష్ణ, ప్రదీప్కుమార్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
లక్ష్మీనర్సింహారావు