వెంకటాపురం(కె): మండల పరిధిలోని బాండ్ మొక్కజొన్న పంటలను శనివారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రాచపల్లి గ్రామంలో సాగుచేసిన మొక్కజొన్న పంటను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి వివరాలను సేకరించారు. రైతులు అనుసరించిన వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై సమగ్ర నివేదికను తయారు చేసి పై అధికారులకు అందజేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్ర వేత్తలు దిలీప్ కుమార్, నాగభూషణం, విశ్వతేజ్, ఏఈవో శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
రామప్పను సందర్శించిన జపాన్ దేశస్తులు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని శనివారం జపాన్కు చెందిన ఎంబసీ అధికారి రైతా సైటో, జపాన్ యూట్యూబర్స్ మయో, ఇండో కర్రీకోలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.
పీహెచ్సీ సందర్శన
వాజేడు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం స్టేట్ ఎంటి మాల్ టీం అసిస్టెంట్ డైరెక్టర్, ఎటమాలజిస్టు నాగయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యశాలలోని రికార్డులను పరిశీలించడంతో పాటు అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని జంగాలపల్లిలో మలేరియా పాజిటివ్ కేసు నమోదు కావటంతో వైద్య సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఆర్డీటీ టెస్టులు నిర్వహించాలని, దోమల మందు పిచికారీ చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ గ్రామాలను ఆశవర్కర్లు రోజు విడిచి రోజు సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి తరుణ్, హెచ్ఈవో అజయ్ కుమార్, ఎల్టీ మురళి, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలి
వెంకటాపురం(ఎం): విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని ములుగు డీఈ పులుసం నాగేశ్వర్రావు సిబ్బందికి సూచించారు. ఎండాకాలం యాక్షన్ ప్లాన్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో విద్యుత్ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఓవర్లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో ఆదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజ్లు పోకుండా సిబ్బంది అప్రమత్తతో పని చేయాలన్నారు. వేసవిలో పెరిగే డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వేణుగోపాల్, సబ్ ఇంజనీర్ సాంబమూర్తి, లైన్ ఇన్స్పెక్టర్లు మల్లారెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
మొక్కజొన్న పంటల పరిశీలన