
‘చావు డప్పులు కేసీఆర్ ఇంటి ఎదుట కొట్టండి’
ములుగు: హుజురాబాద్ ఉప ఎన్నికల స్టంట్లో భాగంగా దళితబంధు పథకాన్ని అమలు చేసి అక్కడ ఓడిపోగానే మాటమార్చి దళితులను మోసం చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఇంటి ఎదుట చావుడప్పులు కొట్టాలని దళితబంధు సాధన సమితి నాయకులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ సూచించారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయని తెలిసినా ఆనాడు కేసీఆర్ దళితబంధు పథకానికి సంభందించిన మొత్తం డబ్బులను ఎందుకు లబ్ధిదారుల ఖాతాలో జమచేయలేకపోయారని ప్రశ్నించారు. దళితబంధు ఇప్పిస్తానని జిల్లా కేంద్రానికి చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడు నిరుపేదల నుంచి లక్షల మేర డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే ఏం చేయాలో అర్ధంకాక దళితబంధు సాధన సమితి ఉద్యమం పేరుతో మరింత డబ్బులు పోగు చేసుకొని పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతుందన్నారు. ఇప్పటికై నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్ధతి మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.