
ఒగరుకాల్వ బుంగ పూడ్చివేత
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప సరస్సు ప్రధానమైన ఒగరు కాల్వకు పడిన బుంగను నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం పూడ్చివేశారు. గత ఆదివారం రాత్రి కాల్వకు బుంగపడి సాగునీరంతా వృథాగా పోతుండడంతో నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు మంగళవారం, బుధవారం బుంగపడిన ప్రదేశంలో 400 ఇసుక బస్తాలను వేసి పూడ్చివేశారు. బుంగను పూడ్చివేసిన అనంతరం ఒగరుకాల్వ ద్వారా ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేసినట్లు డీఈ రవీందర్రెడ్డి, ఏఈ జయంతి తెలిపారు.
కూలీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి
వాజేడు: వలస కూలీల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు వాజేడు, పేరూరు వైద్యులు మధుకర్, రాహిల్కు సూచించారు. వాజేడు వైద్యశాలకు బుధవారం వచ్చిన ఆయన హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతీ ఆశకార్యకర్త వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి నెలవారీగా మందులను అందించాలన్నారు. ఆయన వెంట కోటిరెడ్డి, వేణుగోపాల్, కృష్ణా తదితరులు ఉన్నారు.
క్షేత్రస్థాయిలో
పంటల పరిశీలన
వెంకటాపురం(కె): రైతులు నష్టపోయిన మొక్కజొన్న పంటలను బుధవారం హైదరాబాద్ నుంచి వచ్చిన తెలంగాణ విత్తన ధ్రువీకరణ ఏజెన్సీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాల మేరకు వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల్లో రైతుల పంటల వద్దకు జేడీఏ లక్ష్మణ్, హెడ్ క్వార్టర్స్ డీడీ శంకరయ్య, ఏడీఎస్సీలు సంతోష్, వేమ, ఎస్సీఓలు అపర్ణ, వేణుమాధవ్లు నేరుగా పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఆదేశాలతో కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. మొక్కజొన్న లీఫ్ అనాలసిస్, గింజల ఉత్పత్తిపై పరిశీలనకు నమూనాలను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తామని తెలిపారు. మొక్కజొన్న పంట పరిశీలన నివేదికలను మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు పంపించనున్నట్లు వెల్లడించారు.
మొక్కజొన్న రైతులను
ప్రభుత్వం ఆదుకోవాలి
గోవిందరావుపేట: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ అన్నారు. మండల పరిధిలోని చల్వాయిలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లకావత్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి గోవింద్ నాయక్ హాజరై మాట్లాడారు. గత కొద్ది రోజులుగా పేద, ఆదివాసీ, గిరిజన రైతులను లక్ష్యంగా చేసుకుని దళారులు పూర్తిస్థాయిలో దిగుబడి రాని నకిలీ విత్తనాలు రైతులకు ఇచ్చి వేల రూపాయలు పెట్టుబడులు పెట్టించి నిండా ముంచుతున్నారని తెలిపారు. రైతులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న దళారులతో పాటు వారికి మద్దతు పలుకుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పూర్ణ చందర్, నాయకులు ఈసం సమ్మయ్య, మధు, ఓదెలు, సంజీవ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఒగరుకాల్వ బుంగ పూడ్చివేత