బాండ్‌ మొక్కజొన్న విత్తన శాంపిళ్ల సేకరణ | - | Sakshi
Sakshi News home page

బాండ్‌ మొక్కజొన్న విత్తన శాంపిళ్ల సేకరణ

Mar 12 2025 7:39 AM | Updated on Mar 12 2025 7:35 AM

వెంకటాపురం(కె): వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాండ్‌ మొక్కజొన్న విత్తనాల శాంపిళ్లను సేకరించారు. మండల పరిధిలోని గత కొంతకాలంగా మొక్కజొన్న బీటీ విత్తన సాగు జరుగుతుందనే రైతుల ఆందోళన నేపథ్యంలో విత్తనాలు, ఆకులను ఏటూరునాగారం ఏడీఏ అవినాష్‌ వర్మ ఆధ్వర్యంలో సేకరించారు. సేకరించిన విత్తనాలను సీజ్‌ చేసి పరీక్షల కోసం హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి నవీన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు వ్యవసాయశాఖ అధికారి మహేష్‌, ఏఈవోలు శ్యామ్‌, జాఫర్‌, హరీశ్‌, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

‘విజయ్‌, నాగరాజును

విడుదల చేయాలి’

ములుగు: జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల విజయ్‌, తీగారం గ్రామానికి చెందిన నాగరాజును పోలీసులు వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యర్శులు గడ్డం లక్ష్మణ్‌, నారాయణరావు పోలీసులను మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మంగళవారం ఉదయం 10గంటల సమయంలో వాజేడు సమీపంలో పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారని వివరించారు. విజయ్‌, నాగరాజులను గుట్టల చుట్టూ తిప్పుతూ ఎన్‌కౌంటర్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే సీతక్క చొరవ తీసుకొని వారిని విడిపించాలని డిమాండ్‌ చేశారు.

గొత్తికోయగూడేల్లో

చేతిపంపుల మరమ్మతు

ఏటూరునాగారం: మండల పరిధిలోని గొత్తికోయగూడేల్లో మంగళవారం చేతి పంపులను మరమ్మతు చేసి తాగునీటిని అందజేసినట్లు పంచాయతీ కార్యదర్శి రమాదేవి తెలిపారు. సాక్షిలో ‘వేసవి ముందే వెతలు’ శిర్షీకన కథనం వెలువడింది. ఈ మేరకు పంచాయతీ అధికారులు స్పందించి గంటలకుంట గిరిజనగూడెంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు చేతి పంపులకు మరమ్మతులు చేపట్టారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అంతేకాకుండా ఎలిశెట్టిపల్లి, అల్లంవారిఘణపురం, వీరాపురం తదితర గ్రామాల్లో నల్లాలు, చేతి పంపులు మరమ్మతు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ఏటూరునాగారం: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డి శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై కస్తూర్బా గాంధీ స్వచ్చంధ సంస్థ అధ్యక్షురాలు కొమరిగిరి సామ్రాజ్యాన్ని సన్మానించారు. అలాగే అంగన్‌వాడీలు, ఐకేపీ సభ్యులు, టీచర్లను సన్మానించి మెమెంటోలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలన్నారు. కుటుంబ, విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు.

బాండ్‌ మొక్కజొన్న  విత్తన శాంపిళ్ల సేకరణ
1
1/2

బాండ్‌ మొక్కజొన్న విత్తన శాంపిళ్ల సేకరణ

బాండ్‌ మొక్కజొన్న  విత్తన శాంపిళ్ల సేకరణ
2
2/2

బాండ్‌ మొక్కజొన్న విత్తన శాంపిళ్ల సేకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement