మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

Mar 10 2025 10:26 AM | Updated on Mar 10 2025 10:22 AM

ములుగు: రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలోని సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, డీడబ్ల్యూవో శిరీషతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ మహిళా క్యాంటిన్‌ వంటి పథకాలతో పాటు మరిన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. 37శాతం మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. ఎక్కడా లేని విధంగా రూ.21,635 కోట్లతో మహిళా సంఘాల గ్రూపులకు నిధులు కేటాయించి పలు పథకాల్లో భాగస్వాములను చేశామన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రతినెలా రూ.5లక్షలు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ సిబ్బంది చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఆయా శాఖలలో ఉత్తమ విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలను అందించారు. పాటల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ దివాకర, డీఎఫ్‌ఓ రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించాలన్నారు. జాతీయ రహదారి 100 కిలో మీటర్లు, గోదావరి పరివాహకం 100కిలో మీటర్లు ఉన్నందున పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఐటీడీఏ ద్వారా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అదే విధంగా రామప్ప, లక్నవరం కెనాల్‌ భూ సేకరణ విషయంలో జంగాలపల్లి, కాసిందేవిపేట రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున న్యాయపరమైన పరిహారం అందిస్తామని రైతులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్‌, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, నేషనల్‌ హైవే, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌ శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ ప్రారంభం

జిల్లాను యాక్సిడెంట్‌, డ్రగ్‌ ఫ్రీ జిల్లాగా మార్చుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ను ఎస్పీ డాక్టర్‌ శబరీశ్‌, కలెక్టర్‌ దివాకరతో కలిసి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. అతి వేగం, మద్యం మత్తులో ఉండి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి

శాఖమంత్రి సీతక్క

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి1
1/1

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement