ప్రస్తుతం చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు మాత్రమే కాదు నూతన నటీనటుల మూవీస్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే నిర్మాతలు కూడా పాన్ ఇండియా ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. కేవలం ఒక భాషలోనే కాకుండా..ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. మన తెలుగు నిర్మాతలు..మలయాళ, కన్నడ సినిమాలు చేసి అక్కడ విజయాలు అందుకుంటున్నారు.
అలా తెలుగు నిర్మాత సాహు గారపాటి రూ.10 కోట్లతో నిర్మించిన మలయాళ సినిమా ఒకటి అక్కడి బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. కేవలం 18 రోజుల్లోనే రూ. 205 కోట్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. అదే ‘వాళా 2’. 2024లో వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వాళా’ చిత్రానికి కొనసాగింపు ఇది. కొత్త నటీనటులతో సావిన్ ఎస్ఏ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విపిన్ దాస్ తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఏప్రిల్ 2 మలయాళంలో విడుదలై.. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా 18 రోజుల్లోనే రూ. 205 కోట్ల వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రూ.300+ కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ‘ఎల్2: ఎంపురాన్’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘తుడరుమ్’ చిత్రాలు ఉన్నాయి. వాళా 2 చిత్రాన్ని ఏప్రిల్ 24న తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. మరి ఇక్కడ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.


