సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు కీలక పాత్రలో నటించిన సినిమా ‘గోదారి గట్టుపైన..’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో సుభాష్ చంద్ర మాట్లాడుతూ– ‘‘నా చిన్నతనం నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. బీటెక్ చదువుతున్నప్పట్నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడం ప్రారంభించాను. దాదాపు 80 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఎక్కువగా రాజ్ తరుణ్తో చేశాను. ఈ క్రమంలో ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఫీచర్ ఫిల్మ్స్కి ప్రయత్నాలు ఆరంభించాను.
ఒక సినిమా సెట్స్కు వెళ్లే ముందు ఆగిపోయింది. మరో సినిమా షూటింగ్ పూర్తయింది కానీ రిలీజ్ కాలేదు. ఫైనల్గా ‘గోదారి గట్టుపైన..’ సినిమాతో దర్శకుడిగా వస్తున్నాను. ఈ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పను కానీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. తరాలు మారినా భావోద్వేగాలు మారవని నమ్మే వ్యక్తిని నేను. ఈ సినిమా కథ మన జీవితాల్లో మనం చూసినదే. తండ్రీకూతుళ్ల ప్రేమ, ఇద్దరు ప్రేమికుల ప్రేమ... ఈ రెండు అంశాలను ట్రయాంగిల్ ఫార్మ్లో చూపించే ప్రయత్నం చేశాం. తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి తన కూతుర్ని ఇచ్చి తండ్రి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇది తండ్రి ప్రేమ. ఇటు అబ్బాయి ప్రేమలోనూ నిజం ఉంటుంది.
ఈ అంశాలను పరిణతితో కూడిన ఆలోచనలతో చూపించాం. తెలంగాణ అబ్బాయి సుమంత్ ఈ సినిమా కోసం గోదావరి యాస సాధన చేశాడు. హీరోయిన్ నిధి కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరు. నాగవంశీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా తర్వాతి సినిమా ఈ బ్యానర్లోనే ఉంటుంది. అలాగే హారర్–థ్రిల్లర్ జానర్లో ఓ సినిమా చేయాలని ఉంది’’ అని చెప్పారు.


