టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్కి గోటీల ఫ్యాక్టరీ ఉందనే గాసిప్ గతకొంతకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, పాక్, ఇండియాల్లో గోటీలను అమ్ముతూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడంటూ యూట్యూబ్లో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై రాజశేఖర్ స్పందించే వరకు అంతా నిజమనే నమ్మారు. బైకర్ సినిమా ప్రమోషన్స్లో తనకు ఎలాంటి ఫ్యాక్టరీ లేదని ఆయన క్లారిటీ ఇవ్వడంతో గోటీల ఫ్యాక్టరీ పుకార్లు ఆగిపోయాయి. అయితే రాజశేఖర్ మాత్రం తనపై వచ్చిన పుకార్లను ఎంజాయ్ చేస్తున్నాడు. వాటిపై పంచులు వేస్తూ.. అందర్నీ నవ్విస్తున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయన.. గోటీల ఫ్యాక్టరీ పుకార్లపై తనదైన శైలీలో స్పందించాడు.
జీ తెలుగు చానల్లో ప్రసారం అవుతున్న ఆట డ్యాన్స్ షోకి జీవిత-రాజశేఖర్ జంట గెస్ట్గా వెళ్లింది. ఈ సందర్భంగా హోస్ట్ సుధీర్ వారిని సాదరంగా స్టేజ్పైకి ఆహ్వానించి.. రాజశేఖర్ని డ్యాన్స్ చేయమని కోరాడు. అయితే జడ్జిగా ఉన్న నటి రాధిక వెంటనే ‘డ్యాన్స్ అంటే రాజశేఖర్కి జ్వరం వచ్చేస్తుంది’ అంటూ నవ్వేసింది.
దానికి బదులుగా రాజశేఖర్.. అవును నిజమే. రాధిక చెప్పినట్లు అప్పట్లో డ్యాన్స్ అంటే జ్వరం వచ్చేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను చాలా బిజీ అయిపోయా(నవ్వుతూ..). రోజు ఫ్యాక్టరీకి వెళ్లి వస్తా. నాకు గోటీల ఫ్యాక్టరీ ఉంది. అది కూడా యూట్యూబ్లోనే ఉంది. నెలకు రూ.3 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలియడం లేదు. వెతుకుతున్నాను’ అని చెప్పడంతో సుధీర్తో పాటు జడ్జిగా ఉన్న రాధిక కూడా ఘొల్లున నవ్వేశారు.
రాజశేఖర్ కొత్త సినిమాల విషయానికొస్తే.. బైకర్ మూవీతో ఆయన సెకండ్ ఇన్సింగ్స్ మొదలెట్టాడు. ఇందులో ఆయన హీరో శర్వానంద్కి తండ్రిగా నటించి, మెప్పించాడు. ప్రస్తుతం సోలో హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.


