
సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి నటించడానికి చాలా మంది నటులు ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చేస్తామని చాలామంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం రజనీ సినిమాలో అనవసరంగా నటించానని బాధపడుతోంది. ఆమే మమతా మోహన్దాస్.
యమగొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది ఈ మలయాళ భామ. ఆ సినిమా తర్వాత ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటిస్తూనే..మరోవైపు సింగర్గాను ఆకట్టుకుంది. క్యాన్సర్ బారిన పడడంతో కొన్నాళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత ‘మహారాజా’తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల విడుదలైన ఈ తమిళ్ చిత్రం..తెలుగులోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న మమతా.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది.
రజనీకాంత్ హీరోగా నటించిన కుసేలన్(తెలుగులో కథానాయకుడు)లో మమతా ఓ సాంగ్లో నటించింది. ఈ పాట కోసం రెండు రోజుల పాటు షూటింగ్కి వెళ్లిందట. అయితే ఈ సినిమా ఎడిటింగ్లో ఆమె పార్ట్ మొత్తం డిలీట్ చేసి.. కేవలం ఒక సెకను మాత్రం తెరపై చూపించారట. రిలీజ్ తర్వాత ఆ పాటను చూసి తెగ ఫీలయిందట. అనవసరంగా రజనీకాంత్ సినిమాలో నటించానని బాధపడిందట. ప్రస్తుతం మమతా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నయన్ వల్లేనా?
రజనీకాంత్ కుసేలన్(2008)లో నయనతార హీరోయిన్గా నటించింది. మమతా స్పెషల్ సాంగ్ చేస్తుందని ముందుగా నయన్కు తెలియదట. విషయం తెలిసిన తర్వాత ఆ పాట షూటింగ్కి తాను రాలేనని నయన్ చెప్పేసిందట. వేరే హీరోయిన్ నటిస్తుందని ముందే ఎందుకు చెప్పలేదని డైరెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేయడం..మమతా పార్ట్ని కట్ని చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో కూడా మమతా ఇదే విషయాన్ని చెప్పింది.