Major Movie Trailer: ‘మేజర్’ ట్రైలర్ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
Published
Fri, May 6 2022 9:15 PM
Minister Rajnath Singh Watch Adivi Sesh Major Movie Trailer: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే నేడు 'మేజర్' ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఓ వీడియో రూపంలో మే 9న ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఈమూవీ ట్రైలర్ను భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వీక్షించారు. ఈ ట్రైలర్ చూసిన ఆయన మూవీ టీంను అభినందించడమే కాక ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా మేజర్ స్టోగన్ను విడుదల చేయించింది మూవీ టీం.
ఇక ఈ సినిమాలో మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ హీరో అడివి శేష్ ప్రాణం పెట్టి నటించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. దేశభక్తిని చాటిచెప్పే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. చిత్రంలో హీరోయిన్లుగా సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఓ ప్రత్యేకమైన పాత్రలో రేవతి అలరించనున్నారు.