హీరో, హీరోయిన్లు వివిధ భాషల్లో సినిమాలు చేస్తుంటారు. ఆయా భాషల్లో తమ పాత్ర తాలూకు భావోద్వేగాలు అర్థం చేసుకునేందుకు, సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ఆ భాషలు నేర్చుకుంటుంటారు. తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తమిళ్ నేర్చుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ (2024) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు భాగ్యశ్రీ. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ‘కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించిన ‘కాంత’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారామె.
ప్రస్తుతం తెలుగులో అఖిల్ సరసన ‘లెనిన్’ మూవీలో నటిస్తున్న భాగ్యశ్రీ ‘సెయాన్’ అనే మరో తమిళ్ సినిమాలో అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. నటిగా నన్ను నేను నిరూపించుకునేలా ఉంటుంది. ప్రేక్షకుల పట్ల నిజాయితీగా ఉండాలంటే నటించే చిత్రాల భాషను నేర్చుకోవాలి. తెలుగులో ‘కింగ్డమ్’ చిత్రానికి నేనే డబ్బింగ్ చె΄్పాను. ఇప్పుడు ‘సెయాన్’ కోసం తమిళ భాష నేర్చుకుంటున్నాను’’ అని భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు.


