‘‘నాగబంధం’ సినిమా మొదలు పెట్టినప్పుడు రూ. వంద కోట్ల బడ్జెట్ అవుతుందనుకోలేదు. నలభై కోట్లతో తీయొచ్చని అనుకున్నాం. అయితే సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, మేకప్స్, కాస్ట్యూమ్... ఇలా వీటన్నిటికీ బడ్జెట్ పెరిగింది. 20 శాతం పారితోషికాలకు, 80 శాతం ప్రొడక్షన్ కు ఖర్చు చేశాం. అయితే ఫైనల్ ఔట్పుట్ చూశాక మా యూనిట్ అంతా చాలా సంతృప్తిగా, సినిమా విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్నాం’’ అని డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు.
విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా గురువారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో వాల్ట్ బి గదిని ఎందుకు తెరవలేదనే దానిపై ఎన్నో కథలు ఉన్నాయి. ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ ఒక కథ చేస్తే బాగుంటుందనిపించి ‘నాగబంధం’ కథను రాశాను.
అయితే ఈ సినిమా కోసం మేము అనంత పద్మనాభస్వామి ఆలయం పేరును వాడ లేదు. నా విజన్ ను నేనే డైరెక్ట్ చేస్తే బాగుంటుందని దర్శకత్వం వహించాను. కథ మీద నడిచే సినిమా ఇది. పెద్ద హీరో ఉంటే కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే ఎలాంటి అంచనాలు లేని విరాట్ కర్ణను ఎంపిక చేశాను. ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. నిర్మాతలు కిషోర్, నిషితగార్లు బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు.
నభా నటేష్ పార్వతి అనే వేద విద్యార్థిని పాత్రలో చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో గరుడ రామ్ చేసిన పాత్ర మేకప్కి ఏడు గంటలు పట్టేది. జగపతిబాబుగారు అద్భుతంగా నటించారు. జునైద్, అభి కొత్తవారైనా మంచి సంగీతం అందించారు. ప్రపంచ వ్యాప్తంగా 2500కి పైగా స్క్రీన్లలో ‘నాగబంధం’ రిలీజ్ అవుతోంది. నా దర్శకత్వంలో ‘నాగబంధం 2’ సినిమా కూడా ఉంటుంది’’అన్నారు.


