జిల్లాలోనే అత్యధికంగా 21 మంది ఫెయిల్
పాపన్నపేట(మెదక్): ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లు ఉంది పాపన్నపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫలితాల తీరు. గతంలో శతశాతం ఫలితాలు సాధించిన పాఠశాల.. ఈసారి 82 శాతం సాధించింది. జిల్లాలో అత్యధిక మంది విద్యార్థులు ఫెయిలైన పాఠశాలగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ స్కూల్ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై ంది. దీంతో ఏటా రూ. లక్షల నిధులు పాఠశాల అభివృద్ధికి మంజూరవుతుంటాయి. అంతకుముందే ఇది సక్సెస్ స్కూల్, అయినా పదో తరగతిలో ఆశించిన ఫలితాలు రాలేదు. పాఠశాలలో 440 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ 21 మంది టీచర్లు పని చేస్తుంటారు. పదో తరగతిలో ఈసారి 120 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 99 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 21మంది ఫెయి లయ్యారు. అందులో 14 మంది ఇంగ్లీష్లో, 8 మంది గణితం, సైన్స్లో ఆరుగురు, సోషల్లో ఇద్దరు ఫెయిలయ్యారు. అయితే ఇక్కడ ఇంగ్లీష్ బోధించడానికి ముగ్గురు, గణితం నలుగురు, సైన్స్లో ఐదుగురు, సోషల్కు ముగ్గురు టీచర్లు ఉన్నారు. అయినా ఫలితాలు అధ్వానంగా వచ్చాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పర్యవేక్షణ లోపం, టీచర్ల బాధ్యతారాహిత్యంతో ఫలితాలు అధ్వానంగా వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై హెచ్ఎం మహేశ్వర్ను వివరణ కోరగా.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఫలితాలు తక్కువగా రావడం విచారకరమన్నారు. లోపా లను సమీక్షించుకొని భవిష్యత్లో మంచి ఫలితాల సాధనకు కృషి చేస్తామన్నారు.


